Praja Kshetram
క్రైమ్ న్యూస్పాలిటిక్స్

చెరుకూరి రామోజీరావు మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్త

చెరుకూరి రామోజీరావు మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్త

హైదరాబాద్ జూన్ 08 (ప్రజాక్షేత్రం):తెలుగు పత్రికా దిగ్గజం, ఈనాడు గ్రూప్స్ అధినేత, పద్మవిభూషణ్ గ్రహీత చెరుకూరి రామోజీరావు గారి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటని అన్నారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే రామోజీ కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి ఫోన్ లో మాట్లాడారు. రామోజీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడ నుండే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలిచ్చారు.తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతను, తెలుగు మీడియా రంగానికి కొత్త పంథాను నేర్పిన ఘనత రామోజీరావుకి దక్కుతుందని ఒక సందేశంలో పేర్కొన్నారు. రామోజీరావు తెలుగువారి కీర్తిని దేశ స్థాయిలో చాటిన వ్యక్తిగా సీఎం కొనియాడారు. రంగం ఏదైనా విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేసిన వ్యక్తి రామోజీరావు అన్నారు. పత్రిక నిర్వహణ ఒక సవాల్ అనుకునే పరిస్థితుల్లో ఐదు దశాబ్దాల పాటు ఈనాడు పత్రికను నెంబర్ వన్ స్థానంలో నడపడం, ఈటీవీ స్థాపనతో టీవీ మీడియా రంగానికి దశాదిశా చూపిన దార్శనికుడు రామోజీరావు  అని సీఎం అన్నారు. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు గారిని కలిసిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. అక్షర వీరుడు రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Related posts