Praja Kshetram
తెలంగాణ

తెలంగాణ టెట్‌ ఫలితాలు వెల్లడి.. విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి..

తెలంగాణ టెట్‌ ఫలితాలు వెల్లడి.. విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి..

 

 

హైదరాబాద్ జూన్ 12 (ప్రజాక్షేత్రం): తెలంగాణ టెట్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టెట్‌ ఫలితాలను విడుదల చేశారు. పేపర్‌-1లో 67.13 శాతం మంది, పేపర్‌-2 లో 34.18 శాతం మంది అర్హత సాధించారు. పేపర్‌-1లో మొత్తం 85,996 మంది పరీక్ష రాయగా 57,725 మంది క్వాలిఫై అయ్యారు. పేపర్‌-2కు మొత్తం 1,50,491 మంది పరీక్ష రాయగా.. కేవలం 51,443 మంది మాత్రమే అర్హత సాధించారు.

 

 

అభ్యర్థలు ఫలితాల కోసం schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు. గత ఏడాది జరిగిన టెట్‌ పరీక్షలతో పోలిస్తే ఈ ఏడాది పేపర్‌-1లో ఉత్తీర్ణత శాతం 30.24 శాతం, పేపర్‌-2లో ఉత్తీర్ణత శాతం 18.88 శాతం పెరిగిందని వెల్లడించారు. అయితే టెట్‌ దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది.

 

*దరఖాస్తుదారులకు ప్రభుత్వం ఉపశమనం*

 

ఈసారి టెట్‌ అర్హత సాధించనివారు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అదేవిధంగా టెట్‌లో అర్హత సాధించిన వాళ్లు డీఎస్సీకి ఎలాంటి ఫీజులేకుండా ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఎన్నికల కోడ్‌ కారణంగా టెట్‌-2024 ఫీజును తగ్గించలేకపోయామని ప్రభుత్వం తెలిపింది. అందుకే తదుపరి టెట్‌, డీఎస్సీ దరఖాస్తుదారులకు ఉపశమనం కల్పించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.

Related posts