ఈ నెల 18న ఏపీ క్యాబినెట్ తొలి సమావేశం
అమరావతి జూన్ 13 (ప్రజాక్షేత్రం): ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా… పవన్ కల్యాణ్, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ సాయంత్రం బాధ్యతలు స్వీకరించగా, మంత్రులు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. వారికి ఇంకా శాఖలు కేటాయించలేదు. రేపటిలోగా మంత్రులకు శాఖలు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ నెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ తొలి సమావేశం జరగనుంది. ఈ నెల 19న అసెంబ్లీ సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, బడ్జెట్ ఆమోదం కోసం లాంఛనంగా శాసనసభ సమావేశం నిర్వహించనున్నారు. అదే సమయంలో… ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు తదితర అంశాలను కూడా అసెంబ్లీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.