కమిషన్ నుంచి జస్టిస్ నరసింహారెడ్డి వైదొలగాలి … మాజీ మంత్రి టి.హరీశ్రావు డిమాండ్
హైదరాబాద్ జూన్ 18 (ప్రజాక్షేత్రం): చత్తీస్ గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతోన్న జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్పై మాజీ మంత్రి టి.హరీశ్రావు ఫైర్ అయ్యారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన హరీశ్రావు గత బీఆరెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు ఒప్పందాలపై విచారణ జరిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్ నిష్పక్షపాతంగా విచారణ జరపడం లేదని ఆరోపించారు. విచారణ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చి ఆయన విచారణకు హాజరుకాకముందే కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి అభాండాలు వేశారని మండిపడ్డారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే పవర్ కమిషన్ నుంచి జస్టిస్ నర్సింహా రెడ్డి స్వచ్ఛదంగా వైదొలగాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అటు కేసీఆర్ సైతం పవర్ కమిషన్ నుంచి నరసింహారెడ్డి తప్పుకోవాలని డిమాండ్ చేయగా, హరీశ్రావు ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలకు మద్ధతుగా అదే డిమాండ్ను వినిపించారు. విద్యుత్తు శాఖ మాజీ మంత్రి జి.జగదీశ్రెడ్డి సైతం కేసీఆర్ డిమాండ్తో ఇప్పటికే ఏకీభవించడం జరిగింది.