అక్కడ కలిసికట్టుగా ముందుకు వెళుతున్న బీఆర్ఎస్, బీజేపీ
వరంగల్ జూన్ 19 (ప్రజాక్షేత్రం): మొత్తానికి ఒక్క విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు కలిసికట్టుగా ముందుకు వెళుతున్నారు. అదేంటంటే.. అవిశ్వాస తీర్మానం వ్యవహారం. వరంగల్ మేయర్ గుండు సుధారాణి పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్ధమవుతున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి గుండు సుధారాణి వెళ్లారు. ఇప్పటికే బీఆర్ఎస్ను వీడి పలువురు కార్పోరేటర్లు కాంగ్రెస్లో చేరారు. మిగిలిన 32 మంది బీఆర్ఎస్ కార్పోరేటర్ లు, 10 మంది బీజేపీ కార్పోరేటర్లు కలిసి అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించారు. మేజిక్ ఫిగర్ 34 కాగా.. మరో ఒకరిద్దరు కార్పోరేటర్ల కోసం బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. తమ పార్టీలోకి వచ్చిన కార్పోరేటర్లను మళ్లీ వెళ్లొద్దని కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నారు. మొత్తం కార్పొరేటర్లు 66 మంది కాగా.. మేజిక్ ఫిగర్ 34. బీఆర్ఎస్ కార్పొరేటర్లు 22 మంది ఉన్నారు. గుండు సుధారాణి బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో హాట్ టాపిక్ అయ్యారు. అప్పటి నుంచే ఆమె పార్టీని వీడుతారన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి చెక్ పెడుతూ గుండు సుధారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు.