బీఆర్ఎస్ ఎమ్మెల్యే రూ. 300 కోట్ల అక్రమాలు..ఈడీ సంచలన ప్రకటన
పటాన్చెరు జూన్ 21 (ప్రజాక్షేత్రం): మైనింగ్ పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఉన్న ఎమ్మెల్యే ఇల్లు, ఆఫీసులపై మనీలాండరింగ్, హవాలా అనుమానాల నేపథ్యంలో ఈడీ ఏకకాలంలో సోదాలు జరిపిన విషయం విదితమే. సోదాలు పూర్తి కావడంతో ఈడీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మైనింగ్ పేరుతో ఎమ్మెల్యే పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. రూ.300 కోట్లమేర అక్రమాలు జరిగాయి. ప్రభుత్వానికి రూ.39 కోట్లు నష్టం చేకూర్చారు. బ్యాంక్ అకౌంట్లలో అక్రమ లావాదేవీలను గుర్తించాం. అక్రమ మార్గంలో కూడబెట్టిన డబ్బుతో రియల్ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారు. సోదాల సందర్భంగా రూ.19 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. బినామీల పేర్లతో లావాదేవీలను గుర్తించాం. కొన్ని బ్యాంక్ లాకర్స్ని ఇంకా తెరవాల్సి ఉంది. మధుసూదన్ రెడ్డి, మహిపాల్రెడ్డికి పలువురు బినామీలుగా ఉన్నారు” అని ఈడీ తన ప్రకటనలో పేర్కొంది.