శరీరాన్ని మనసును కలిపే ప్రక్రియ యోగా : కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి
హైదరాబాద్ జూన్ 21 (ప్రజాక్షేత్రం): యోగా అంటే శరీరాన్ని, మనసును కలిపే ప్రక్రియ అని కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని నిజాం కాలేజీ మైదానంలో నిర్వహించిన యోగా మహోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రాణులు ప్రకృతితో మమేకమవ్వడమే యోగా అంతరార్ధమని తెలిపారు. ఇవాళ ప్రపంచమంతా యోగా వైపు చూస్తోందని చెప్పారు. యోగా అలవాటు చేసుకుంటే విజయాలన్నీ చేకూరతాయన్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ యోగాపై ప్రధానిగా మోదీ నిర్ణయాన్ని ప్రపంచమంతా ఆచరిస్తోందని చెప్పారు. మోదీ వల్ల యోగాకు అన్ని దేశాల్లో ప్రాముఖ్యత లభించిందని తెలిపారు. కులమతాలకు అతీతంగా అందరూ నేర్చుకోవాల్సిన విద్య యోగా అని వివరించారు. కరీంనగర్ లోని జ్యోతినగర్ మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని యోగాసనాలు వేశారు. హైదరాబాద్ లోని కన్హ శాంతివనంలో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమలో తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్టన్ పాల్గొనగా, సంజీవయ్య పార్కులో జరిగిన యోగా దినోత్సవంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహా పాల్గొన్నారు. వరంగల్లోని సీకేఎం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో చినజీయర్ స్వామి పాల్గొన్నారు.