కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళన
హైదరాబాద్ జూన్ 22 (ప్రజాక్షేత్రం): కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాచిగూడలోని ఆయన ఇంటిని విద్యార్థి సంఘాల నేతల ఉమట్టడించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్, వీజేఎస్, వైజేఎస్ విద్యార్థి నాయకులు ఇయన ఇంటిలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులకు మధ్య తోపులాట చోటుచేసుకున్నది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో ఎమ్మెల్సీ వెంకట్తోపాటు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. వారిని నల్లకుంట పోలీస్ స్టేషన్కు తరలించారు. నీట్ సమస్యపై కేంద్ర మంత్రిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరామని, అయినా ఆయన ఇవ్వకపోవడంతో ఇంటిని ముట్టడించామని నాయకులు తెలిపారు.