ఎలాంటి పదవీ లేకున్నా కల్యాణలక్ష్మి చెక్కులు పంచిన రేవంత్ రెడ్డి సోదరుడు.. మండిపడ్డ జడ్పీటీసీ
కొడంగల్ జూన్ 25 (ప్రజాక్షేత్రం): రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు.. ఆయా నియోజకవర్గాల్లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కూడా అదే పని చేశారు. తనకు ఎలాంటి పదవి లేకున్నా.. కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. రేవంత్ అన్న తిరుపతిరెడ్డికి ఎలాంటి పదవీ లేకున్నా.. కల్యాణలక్ష్మి చెక్కులు ఎలా పంపిణీ చేస్తారంటూ దౌల్తాబాద్ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ వేదికపైనే ప్రశ్నించారు. ఎలాంటి పదవీ లేకున్నా కేవలం ముఖ్యమంత్రి అన్న అనే కారణంతో కల్యాణ లక్ష్మి చెక్కులు ఎలా ఇస్తారు..? ప్రోటోకాల్ ప్రకారం కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయించాలి. కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన చెక్కులనే ఇస్తున్నారు కానీ కాంగ్రెస్ హామీ ఇచ్చిన తులం బంగారం ఇవ్వడం లేదంటూ తిరుపతి రెడ్డిపై కోట్ల మహిపాల్ మండిపడ్డారు.