ప్రైవేట్ ఆస్పత్రుల ప్రారంభోత్సవానికి వెళ్లే సీఎంకు అవి కనిపించవా..?
-మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
చేవెళ్ల జూన్ 29 (ప్రజాక్షేత్రం): ప్రైవేట్ ఆస్పత్రుల ప్రారంభోత్సవానికి వెళ్తున్న ముఖ్యమంత్రి గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులపై రివ్యూ ఎందుకు చేయరని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రశ్నించారు. విలువలతో బతుకుతానని చెప్పిన ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇప్పుడు పార్టీ ఎందుకు మారారని అన్నారు. శనివారం బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ… నమ్ముకున్న కార్యకర్తలకు కాలే యాదయ్య ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పదేళ్లు దేవుడిలా కనిపించిన కేసీఆర్…ఇప్పుడు కాలే యాదయ్యకు దెయ్యం అయ్యాడా అని మండిపడ్డారు. చేవెళ్ల నియోజక వర్గ కార్యకర్తలు నాయకులు అధైర్య పడాల్సిన అవసరం లేదని చెప్పారు. బీఆర్ఎస్ పనైపోయిందని కొంతమంది నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరుతున్నామని అన్నారు.
*బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లొంగదీసుకుంటున్నారు: మహేష్ రెడ్డి*
ఆరు గ్యారెంటీలు పక్కన పెట్టి మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరుగురిని కాంగ్రెస్లో చేర్చుకున్నారని మాజీ ఎమ్మెల్యే కె .మహేష్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ను ఖతం చేయాలని చూస్తున్నారని, నయానో భయానో లొంగదీసుకుంటున్నారని విమర్శించారు. యాదయ్య ఏం ప్రలోభాలకు లొంగి కాంగ్రెస్ లో చేరాడో…? చెప్పాలని ప్రశ్నించారు. కాలే యాదయ్య ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలిస్తే విలువలు ఉన్నాయని భావిస్తామని మహేష్ రెడ్డి పేర్కొ్న్నారు.