ప్రైవేట్ స్కూల్లో యూనిఫామ్,పుస్తకాల పేరుతో దోపిడీ
-ప్రైవేట్ స్కూల్లో యూనిఫామ్,పుస్తకాల పేరుతో దోపిడీ.
-నోటీస్ బోర్డులో కనపడని ఫీజు వివరాలు.
-ప్రైవేట్ స్కూల్స్ లో కనబడని నియమ నిబంధనలు.!
-ప్రైవేటు పాఠశాలల తీరు నియంత్రించే వాళ్ళు ఎవరు..?ఎక్కడ…?
-పెన్ -పెన్సిల్ తప్ప అన్ని స్కూల్లోనే తీసుకోవాలా…?
-నిద్రపోతున్న విద్యాశాఖ అధికారులు.
-ప్రస్తుతం ప్రయివేట్ స్కూల్లల్లో జరుగుతున్న అధిక ఫీజుల వసుల్లపై ప్రత్యేకం.!
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 30 (ప్రజాక్షేత్రం): జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం పుస్తకాలు,ఫీజులు,యూనిఫాంల పేరుతో తల్లిదండ్రులను దోపిడీ చేస్తోంది.వేలాది రూపాయలు అడ్డగోలుగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.. విద్యార్ధుల తల్లితండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాలనే మోజులో నానా అవస్ధలు పడి వేలాది రూపాయలు చెల్లిస్తున్నారు. విద్యార్ధుల తల్లితండ్రుల బలహీనలతను ఆసరాగా తీసుకొని ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా వేలాది రూపాయలు దోపిడీ చేస్తున్నారు.. కొన్ని పాఠశాలలకు అయితే ఆట స్ధలం కాని కనీస మౌళిక వసతులు గాని లేవు.కానీ,విద్యాశాఖ అధికారులు మాత్రం ముడుపులు తీసుకొని ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇస్తుండటంతో ఏళ్ల తరబడి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అలాగే నడుస్తున్నాయి.. ఇదంతా ఒక ఎత్తుకాగా పుస్తకాలు, యూనిఫాం పేరుతో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విదంగా దోపిడీ చేస్తున్నారు.ఒక్కో విద్యార్థి నుంచి తరగతులను బట్టి రూ.4వేల నుంచి రూ.8వేలు వరకు పుస్తకాల కోసం,యూనిఫాంకు రూ.4 నుంచి రూ.6 వేలు వసూళ్లు చేస్తున్నారు..ప్రైవేట్ పాఠశాలలు అడ్డగోలుగా వేలాది రూపాయలు వసూళ్లు చేయటం పట్ల విద్యార్థుల తల్లితండ్రులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
*ప్రైవేటు పాఠశాల నియంత్రించే వాళ్ళు ఎవరు..?ఎక్కడ…?*
*ఫీజు నోటీసు బోర్డులో నమోదు చేయాలి.*
ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలో ఫీజులు నియంత్రణను పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు..ఫీజులు ఏ క్లాస్ కు ఎంత తీసుకుంటారు అన్నది నోటీసు బోర్డులో నమోదు చేయాలి.కానీ విద్యార్థి సంఘాలు పదే పదే చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు..ఫీజులు వసూలుతోపాటు పుస్తకాల పేరుతో మరి కొంత లాగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేక ప్రైవేటు మామూళ్ల మత్తులోనే ఉంటారా వేచి చూడాలి.
*ప్రైవేట్ స్కూల్స్ లో కనపడని నిబంధనలు.!*
ప్రైవేటు పాఠశాలలు కొన్ని నిబంధనల ప్రకారం నడవడం లేదు.పాఠశాలలకు మైదానాలు ఉండవు,రిజిస్ట్రేషన్ కోసం ఎక్కడో మైదానం చూపిస్తారు.అది ఎక్కడుందో విద్యార్థులకు ఎప్పటికీ తెలిసే పరిస్థితి ఉండదు.ఇంకొన్ని స్కూల్స్ అయితే రోడ్డు పక్కనే విద్యా సంస్థలు నడుపుతూ విద్యార్థులను శబ్ద కాలుష్యానికి గురి చేస్తున్నారు.చాలా స్కూళ్లలో ఫైర్ సేఫ్టీ కూడా ఉండడం లేదు.ఉన్నా నామమాత్రమేనని పాఠశాలలు నిర్వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
*ఎవరికి చెప్పుకోలేము.అయినా ఇబ్బంది తట్టుకోలేకపోతున్నాం.*
కొంతమంది పిల్లల తల్లిదండ్రులని అడిగితే మా పిల్లలు స్కూల్లో చదువుతారు.కాబట్టి కానీ ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేమని,మా పిల్లలు చదువులో స్కూల్లో ఇబ్బంది పడతారని భయపడి ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*పాతుకుపోయిన విద్యాశాఖ అధికారులు.*
ఒకప్పుడు పాఠశాలలో ఏం జరుగుతుంది,ఎంత సంఖ్య ఉంది, ఎలా నిర్వహిస్తున్నారు,విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి,ఉపాధ్యాయులపైన,విద్యార్థుల చదువులకు సంబందించి పేరెంట్స్ ఎలాంటి అభిప్రాయాలు చెబుతున్నారు,విందామనే కనీస అవకాశం కూడా ఇవ్వడం లేదనేది జగమెరిగిన సత్యం.ఇదిలా ఉంటే కొన్ని మండలాలలో విద్యాశాఖ అధికారులు మాత్రం ఏళ్లతరబడి ఇక్కడే పాతుకుపోయి అటు ప్రయివేట్ పాఠశాలలకు లాభాల పంటలు తెస్తూన్నారే తప్ప లక్షలు ఖర్చు చేస్తున్న తల్లిదండ్రులకు ఎలాంటి ఉపయోగం లేదనే విమర్శలు బహటంగానే వినిపిస్తున్నాయి.మరి ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రయివేట్ పాఠశాలలపై,కిందిస్తాయి అధికారులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు,పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.మరి జిల్లా స్థాయి అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఇక వేచి చూడాలి.