Praja Kshetram
క్రైమ్ న్యూస్

తోటి సిబ్బంది వేధింపులకు ఎస్సై బలి.. నలుగురిపై వేటు.

తోటి సిబ్బంది వేధింపులకు ఎస్సై బలి.. నలుగురిపై వేటు.

 

-ఆత్మహత్య యత్నం చేసుకున్న అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్‌ మృతి.

-అల్లుడు మరణ వార్త విని మేనత్త రాజమ్మ మృతి.

భద్రాద్రి జులై 07(ప్రజాక్షేత్రం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్‌ మృతి చెందారు. ఆయన గత ఆదివారం మహబూబాబాద్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున చనిపోయారు. తోటి సిబ్బంది వేధింపులతోనే తాను ఆత్మహత్యాయత్నం చేశానని శ్రీనివాస్ మరణ వాంగ్మూలంలో వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సతీమణి కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదుతో సీఐ జితేందర్‌రెడ్డిపైన, పోలీసు కానిస్టేబుళ్లు సన్యాసినాయుడు, సుభాని, శేఖర్, శివనాగరాజుపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేశారు. మృతుడికి ఏడేళ్ల వయసున్న కుమార్తె, ఐదేళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. కాగా తన అల్లుడు మరణ వార్త విన్న మేనత్త రాజమ్మ ఆదివారం ఆకస్మికంగా గుండెపోటుకు గురై మృతి చెందడంతో ఎస్సై కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది.

అశ్వారావుపేట పోలీస్‌ సేషన్‌ పక్కనే ఉన్న క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న ఎస్సై శ్రీనువాస్‌ జూన్‌ 30న ఉదయం 8.30 గంటలకు మఫ్టీలో స్టేషన్‌కు వచ్చారు. సోమవారం నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచనలు చేశారు. అదే సమయంలో ప్రైవేట్‌ కారు రావడంతో డ్రైవర్‌ను దింపిన ఎస్సై.. ఇప్పుడే వస్తానంటూ కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లిపోయారు. మధ్యాహ్నం తరువాత సిబ్బంది ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ రావడంతో సీఐ జితేందర్‌రెడ్డికి సమాచారం అందించారు. ఆయన వెంటనే ఎస్సై ఫోన్‌ లోకేషన్‌ను ట్రాక్‌ చేయగా మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత మండలంలోని తిరుమలకుంట అటవీ ప్రాంతంలో స్విచ్ఛాఫ్‌ అయినట్టు గుర్తించారు. కానీ రాత్రి 10:45 గంటల వరకు ఆచూకీ లభ్యం లభించలేదు. ఇంతలో మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం శివారులో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్టు గుర్తించారు.

*తోటి సిబ్బంది వేధింపులతోనే ఘటన*

ఎస్సై శ్రీరాముల శ్రీనువాస్‌ ఆత్మహత్యకు తోటి సిబ్బంది వేధింపులు, కుల వివక్ష కారణమన్న ఆరోపణలే కారణమని మృతుడి మరణ వాంగ్మూలంలో వెల్లడించాడు. చనిపోయే ముందు ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఇచ్చిన మరణ వాంగ్మూలం వీడియోలో నలుగురు కానిస్టేబుల్స్ సన్యాసి నాయుడు, శేఖర్, సుభాని, శివ నాగరాజు సహా సీఐ వేదింపులతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి భార్య కృష్ణవేణి సైతం అవే ఆరోపణలు చేస్తున్నారు. మీ ఎస్సీలు మారరా అంటూ కులం పేరుతో సీఐ జితేందర్ రెడ్డి నా భర్తను వేదించాడని ఆమె వెల్లడించారు. కాగా ఎస్సై శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్య ఘటనపై అధికారులు ఇప్పటికే సీఐ , సహా నలుగురిని సస్పెండ్ చేశారు. ఎస్సై తనపై జరిగిన వేధింపులకు సంబంధించి ఫోన్ కాల్స్ రికార్డులు కూడా బయటపెట్టారు.

Related posts