Praja Kshetram
పాలిటిక్స్

కేకే ఖాళీ చేసిన సీటులో నాకు అవకాశమివ్వాలి.

కేకే ఖాళీ చేసిన సీటులో నాకు అవకాశమివ్వాలి.

 

*-సీనియర్ నేత వీహెచ్ కీలక వ్యాఖ్యలు.*

*-ఎంపీ ఎన్నికల్లో ఓటమిపై కురియన్ కమిటీ అధ్యయనం.*

హైదరాబాద్ జులై 10(ప్రజాక్షేత్రం): ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన కే.కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి తనకు అవకాశం ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన ఎనిమిది ఏళ్లలో నాకు ఒక్క పదవి కూడా లేదని అందువల్ల ఈ అవకాశం తనకు కల్పించాలని కోరారు. బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ టికెట్ తనకు వస్తే గెలిచేవాడిని అని కామెంట్ చేశారు. టికెట్ విషయంలోనూ తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై అధ్యయనం కోసం ఏఐసీసీ ఏర్పాటు చేసిన కురియన్ కమిటీ బుధవారం నుంచి తెలంగాణలో పర్యటిస్తుందని, ఈ కమిటీ ముందుగా సునీల్ కనుగోలును కలవాలని వీహెచ్ కోరారు. రైతురుణమాఫీ చేయబోతున్న సీఎం రేవంత్‌రెడ్డికి ఈ సందర్భంగా వీహెచ్ ధన్యవాదాలు తెలిపారు. టీ-20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపిన వీహెచ్ జట్టు సభ్యుడైన హైదరాబాద్ వాసి సిరాజ్‌కు ఉద్యోగం, ప్లాట్ ఇవ్వాలని నిర్ణయించడంపై సీఎంకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. గతంలో సిరాజ్ ప్రతిభను చూసి సీఎఫ్ఐ చైర్మన్ గా నేను సన్మానించానని గుర్తు చేశారు. దేశంలో క్రికెట్ కు నుంచి క్రేజ్ ఉందని అయితే హైదరాబాద్ తో తప్ప తెలంగాణాలో మరెక్కడా క్రికెట్ స్టేడియం లేదన్నారు. ఏపీలో 12 క్రికెట్ స్టేడియాలు ఉన్నాయని అందువల్ల మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో స్టేడియం కోసం 12 ఎకరాల స్థలాన్ని కేటాయించి క్రీడలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రికి విన్నపం చేస్తున్నట్లు చెప్పారు. సీఎం కూడా యువకుడే అని క్రీడారంగంలోకి యువకులను ప్రోత్సహించాలన్నారు. గత సీఎంకేసీఆర్‌ క్రీడలను ప్రోత్సహించలేదని విమర్శించారు. ఒక ఎకరం భూమి కూడా కేటాయించలేదని ధ్వజమెత్తారు. త్వరలో ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ లో క్రీడలకు ఎక్కువ నిధులు కేటాయించాలన్నారు.

Related posts