బీఆరెస్వీకి పార్టీ అండగా నిలుస్తుంది.. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిద్దాం.
*-బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.*
*-గాయపడిన వారికి పరామర్శ.*
హైదరాబాద్ జులై 11(ప్రజాక్షేత్రం): కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆరెస్వీ విద్యార్థి, నిరుద్యోగ సమస్యలతో పాటు ఇతర ప్రజా సమస్యలపై సాగిస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని, వారికి బీఆరెస్ పార్టీ అన్ని విధాల అండగా నిలుస్తుందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు. టీజీఎస్పీసీ, విద్యాశాఖల ముట్టడి, ఉస్మానియా ఆందోళనల్లో గాయపడిన బీఆరెస్వీ నాయకులతో గురువారం తన నివాసంలో భేటీయైన కేటీఆర్ వారిని పరామర్శించారు. వారి పోరాట పటిమను ప్రశంసించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు పాల్పడినప్పుడు, గ్రూప్-1 మెయిన్స్కు 1:100 పిలవాలని, డీఎస్సీ వాయిదా వేయాలన్న సమస్యలపై టీఆరెస్వీ నిరసనలు చేపట్టిందని గుర్తు చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతూనే ఉండాలని కేటీఆర్ సూచించారు. ఎల్లప్పుడూ పార్టీ అగ్ర నాయకత్వం బీఆరెస్వీ నాయకులకు అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్ధిరాజు రవిచంద్ర, టీఆరెస్వీ నాయకులు గెల్లు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.