Praja Kshetram
జాతీయం

కవిత బెయిల్ పిటిషన్‌పై కీలక పరిణామం.

కవిత బెయిల్ పిటిషన్‌పై కీలక పరిణామం.

 

 

ఢిల్లీ జులై 12(ప్రజాక్షేత్రం):మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై ఈరోజు(శుక్రవారం) విచారణ చేపట్టింది. ఈ కేసులో కవిత పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను దాఖలు చేసినట్టు సీబీఐ రౌస్‌అవెన్యూ కోర్టుకు తెలిపింది. దానిని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ అంశంపై విచారణ చేపడతామని న్యాయమూర్తి కావేరి భవేజా తెలిపారు. సీబీఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్‌పై విచారణ జరిపింది. సీబీఐ ఛార్జ్ షీట్‌లో తప్పులున్నాయని కవిత తరపు న్యాయవాది నితేష్ రానా న్యాయస్థానానికి చెప్పారు. తప్పులు లేవని సీబీఐ తరపు న్యాయవాది అన్నారు. ఛార్జ్‌షీట్‌లో తప్పులున్నాయని కోర్ట్ ఆర్డర్ ఫైల్ చేశారా అని జడ్జి కావేరి భవేజా అడిగారు. ఛార్జ్‌షీట్‌లో తప్పులున్నాయని కోర్ట్ ఆర్డర్ ఫైల్ చేయాలని జడ్జి కావేరి భవేజా చెప్పారు. కోర్ట్ ఆర్డర్ అప్ లోడ్ కాలేదని కవిత తరపు న్యాయవాది నితేష్ రానా అన్నారు. తదుపరి విచారణను జూలై 22కి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.డిఫాల్ట్ బెయిల్, ఛార్జ్‌షీట్‌లో తప్పులపై విచారణ జరిగేంత వరకు ఛార్జ్ షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ వాయిదా వేయాలని న్యాయవాది నితేష్ రానా చెప్పారు. ఛార్జ్ షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశం కవిత డిఫాల్ట్ బెయిల్‌కి సంబంధం లేదని సీబీఐ తరపు న్యాయవాది వివరించారు. ఛార్జ్‌షీట్ పూర్తిగా లేదని వాదించడం లేదని.. తప్పుగా ఉందని చెబుతున్నానని నితేష్ రానా న్యాయస్థానానికి తెలిపారు.ఢిల్లీ మద్యం విధానం కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలోనే ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 16న ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో సీబీఐ ఆమెను హాజరుపరిచింది. కవిత తిహాడ్‌ జైలులో ఉండగానే ఏప్రిల్‌ 11న సీబీఐ అరెస్టు చేసినట్టు ప్రకటించింది. ఆ తర్వాత కవిత బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా రౌస్‌అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ట్రయల్‌ కోర్టు తీర్పును కవిత హైకోర్టులో సవాల్‌ చేశారు.

Related posts