కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మరో ఎమ్మెల్యే.
హైదరాబాద్ జులై 13 (ప్రజాక్షేత్రం):సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అరెకపూడి గాంధీ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. అరెకపూడి గాంధీతోపాటు శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ నేత మువ్వ సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో రెండు రోజుల్లో హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీని వాసరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున 39 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అకాల మరణంతో ఆ స్థానంకు ఉప ఎన్నికలు నిర్వహించారు. ఆ ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించాడు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం 38కి చేరింది. గత ఆర్నెళ్ల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. ఇవాళ శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి కండువా కప్పుకునేందుకు సిద్ధమై నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సియం సలహాదారు నరేంద్రర్ రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ తదితరులు పాల్గొన్నారు.