నియోజకవర్గంలో నిరుద్యోగం లేకుండా చేస్తా.
-స్పీకర్ ప్రసాద్ కుమార్.
బంట్వారం/వికారాబాద్, జూలై 16: వికారాబాద్ నియోజకవర్గంలో నిరుద్యోగం లేకుండా చేస్తానని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. మంగళవారం బంట్వారంలోని రైతు వేదికలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశం ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను స్పీకర్ పంపిణీ చేసి మాట్లాడారు. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్షి, షాదీముబారక్ ఎంతో చేయూతనిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో రోడ్లన్నీ గుంతల మయంగా మారాయన్నారు. నియోజకవర్గంలోని రోడ్లు, వంతెనలు ఎక్కడెక్కడ ఏవేవి అవసరం ఉన్నాయో వాటన్నింటినీ నూతనంగా నిర్మించే బాధ్యత తనదని స్పీకర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగ నియంత్రణకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, వికారాబాద్ నియోజకర్గానికి కూడా ఒక కంపెనీని తీసుకువస్తానని అన్నారు. దాని కోసం స్థలం కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందన్నారు. వచ్చే నెల ఆగస్టు 15వ తేదీ నాటికి రైతుబంధును రైతు భరోసాగా పేరు మార్చి అర్హులైన రైతులందరికీ ఒకే దఫాలో రూ.15 వేల పెట్టుబడి సాయం అందజేయడం జరుగుతుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు, తదితరులుపాల్గొన్నారు.
