రుణమాఫీకి రేషన్ కార్డును తప్పనిసరి చేయడం దుర్మార్గం.
-తొండ రవి బిజెపి జిల్లా అధికార ప్రతినిధి
శంకర్ పల్లి జూలై 15 : రైతుల పంట రుణమాఫీకి రేషన్ కార్డు ఉండాలని ప్రభుత్వం కండిషన్ పెట్టడం దుర్మార్గమని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తొండ రవి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందన్నారు. అధికారమే లక్ష్యంగా అబద్ధ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పాలకులు రుణమాఫీ చేయకుండా రైతులను మరోసారి మోసం చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. రేషన్ కార్డుల పేరుతో రుణమాఫీకి తీవ్ర జాప్యం చేస్తారని మండి పడ్డారు. రైతులను గుర్తించేందుకు రేషన్ కార్డు ప్రామాణికం కాదని గతంలో చెప్పిన సీఎం రేవంత్రెడ్డి మోసపూరిత మార్గదర్శకాలతో రైతులను ఇబ్బంది పెట్టడం అన్యాయం అన్నారు. రెండు లక్షలకు మించి ఉన్న రుణాన్ని రైతు బ్యాంకుకు ముందుగా చెల్లించి తర్వాత అర్హతనుబట్టి 2లక్షల రుణమాఫీ వర్తింపచేస్తామని అనడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఇలాంటి విధానాలను అవలంబిస్తే ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెబుతారని, షరతులు లేకుండా రూ.2లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.