హత్యచేయాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా తీర్పు…
-పాత్లోత్ గోపాల్ హత్య కేసు నిందితుడు వర్త్యకాల్యాకు యావజ్జీవ కారాగార శిక్ష.
-సహకరించిన మరో ఆరుగురికి మూడేళ్ల కారాగారం.
-సంచలన తీర్పు వెలువరించిన అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జ్ జయలత.
-మోకిలా పోలీసులకు ప్రశంసల ఝల్లు కురిపిస్తున్న శంకర్ పల్లి మండల ప్రజలు.
శంకర్ పల్లి ఆగస్టు 27(ప్రజాక్షేత్రం): కాకర్లగుట్ట తండాకు చెందిన పాత్లోత్ గోపాల్ హత్య కేసులో ఎల్బీనగర్ అదనపు జిల్లా కోర్ట్ న్యాయమూర్తి జయలత తీర్పు వెలువడిస్తూ.., సగటు వ్యక్తి మరో వ్యక్తిని హత్య చేయాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా సంచలన తీర్పు వెలువరించారు. వివరాలలోకి వెళితే అక్టోబర్ పది,2013 నాడు రాత్రి దాదాపు ఎనిమిది గంటల సమయంలో కాకర్లగుట్ట తండాకు చెందిన పాత్లోత్ గోపాల్, తన కూతురు మరియు అల్లుడు కుటుంబ వ్యవహారాల విషయంలో గొడవ పడుతున్నారనే సమాచారం మేరకు తన కూతురును ఇచ్చిన గ్రామమైన మహారాజ్ పేట్ లోని తన కూతురు ఇంటికి వెళ్లి, తన కూతురు మరియు అల్లుడిని సముదాయిస్తుండగా, అంతలోనే అతడి అల్లుడి కుటుంబ సభ్యుడగు వర్త్య కాల్యా, పాత్లోత్ గోపాల్ తో గొడవ పెట్టుకొని ఇనుప రాడ్ తో ఛాతీపై బలంగా కొట్టాడు. గోపాల్ కుటుంబ సభ్యులు అడ్డుపడినా వినకుండా, కాల్యా కుటుంబ సభ్యులైన పాత్లోత్ హున్య, పాత్లోత్ శ్రీను, పాత్లోత్ పున్యా, పాత్లోత్ వాస్య, వర్త్య లలిత, వర్త్య పెంటమ్మ తో కలసి, గోపాల్ ను అతని కుటుంబ సభ్యులను కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. తీవ్ర గాయాల పాలై స్పృహ తప్పి పడిపోయిన పాత్లోత్ గోపాల్ ను తన కుటుంబ సభ్యులు చేవెళ్ల లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా, పరీక్షించిన డాక్టర్లు గోపాల్ చనిపోయాడని నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకొని పక్కా ఆధారాలతో కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసు విషయమై గత పదినెలలుగా విచారణ కొనసాగుతుండగా నిన్న ఆగస్ట్ 27 న ఎల్బీనగర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జ్, ప్రధాన నిందితుడైన A1 వర్త్య కాల్య తండ్రి లాల్య వయసు 27 సంవత్సరాలు కు యావజ్జీవ కారాగార శిక్ష మరియు ఐదు వేల జరిమాన విధిస్తూ తీర్పు వెలువడించారు. మిగతా ఆరుగురికి మూడేళ్ల కటిన కారాగార శిక్ష మరియు ఐదువేల జరిమానా విధించారు. ఈ కేసులో సరియైన సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించి నిందితులకు తగిన శిక్ష పడేలా కీలకంగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్ 1గంగారాం, ఇన్స్పెక్టర్ 2 డి నాగేశ్వరరావు, ప్రస్తుత సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వీరబాబు, హెడ్ కానిస్టేబుల్ జానయ్య, మరియు మోకిల పోలీస్ కానిస్టేబుల్లందరికీ మండల ప్రజలు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.