జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్పై కీలక తీర్పు ఇచ్చిన కోర్ట్.
హైదరాబాద్ సెప్టెంబర్ 25(ప్రజాక్షేత్రం): తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న 21 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనను నాలుగు రోజులపాటు పోలీసు కస్టడీకి కోర్ట్ అనుమతించింది. ఈ మేరకు జానీ మాస్టర్ కస్టడీ కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ అనంతరం న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. 4 రోజులు కస్టడీకి ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. బుధవారం నుంచి శనివారం వరకు కస్టడీకి రంగారెడ్డి కోర్టు అనుమతించింది. పొక్సోపై నార్సింగ్ పోలీసులు విచారణ జరపనున్నారు. జానీ మాస్టర్ను కస్టడీలోకి తీసుకునేందుకు నార్సింగ్ పోలీసులు చంచల్ గూడ జైలుకి వెళ్లారు. కాగా ఇప్పటికే బాధితురాల నుంచి పోలీసులు పలు ఆధారాలను సేకరించారు. వీటిని జానీ ముందు పెట్టి ఆయనను పోలీసులు ప్రశ్నించనున్నారు. కాగా జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. కాగా పోలీసు విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. బాధితురాలు ఇప్పటికే పలు సాక్ష్యాలను సమర్పించారంటూ కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో విచారణలో జానీ మాస్టర్ చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది. కాగా అత్యాచారం కేసులో అరెస్టయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా(42)ను పోలీసులు ఇటీవలే చంచల్గూడ జైలుకు తరలించారు. ఆయన్ను గోవా నుంచి నగరానికి తీసుకొచ్చి శుక్రవారం మధ్యాహ్నం రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్పల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి, ఇరువర్గా ల వాదనలూ విన్న న్యాయమూర్తి.. అక్టోబరు 3వ తేదీ వరకు (14 రోజుల) రిమాండ్ విధించారు. దీంతో ప్రస్తుతం చంచల్గూడ్ జైలులో ఉన్నారు.
*రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు.*
జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు విస్తుపోయే విషయాలను వెల్లడించారు. జానీమాస్టర్ దురుద్దేశంతోనే బాధితురాలిని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా తీసుకున్నట్లు తెలిపారు. ఆమెకు ఒక ప్రముఖ డ్యాన్స్ షోలో పాల్గొనే అవకాశం రావడంతో 2017లో నగరానికి వచ్చిందని.. తర్వాత జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరిందని పేర్కొన్నారు. 2019 డిసెంబరు 15 నుంచి జానీ మాస్టర్ వద్దే పనిచేస్తూ అల్కాపురికాలనీలో ఉంటోందని, ఆ సమయంలో ఇద్దరూ ఒక సూపర్హిట్ సినిమాకు పనిచేశారని ప్రస్తావించారు. ఆ సినిమా పని నిమిత్తం 2020 జనవరి 10న (అంటే చేరిన నెలరోజుల్లోపే) జానీ మాస్టర్, బాధితురాలు, మరో ఇద్దరు సహాయకులు ముంబైకి వెళ్లారన్నారు. ఆ రోజు రాత్రి 12 గంటలకు బాధితురాలిని ఆధార్కార్డు, ఇతర డాక్యుమెంట్లు తీసుకొని తన గదికి రావాలని ఆదేశించారని, ఆమె గదిలోకి రాగానే గడియపెట్టి అత్యాచారం చేశాడని తెలిపారు. అప్పటికీ బాలిక వయసు 16 సంవత్సరాలని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.