Praja Kshetram
తెలంగాణ

పేదల ఇళ్లకు కాదు.. రేవంత్‌ ఇంటి మీదకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను పంపించండి : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌.

పేదల ఇళ్లకు కాదు.. రేవంత్‌ ఇంటి మీదకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను పంపించండి : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌.

 

హైదరాబాద్ సెప్టెంబర్ 30(ప్రజాక్షేత్రం):హైడ్రా వ్యవహారంలో నిజమైన బాధితులు తెలంగాణ పేద ప్రజలు అని.. అసలు నిందితుడు సీఎం రేవంత్‌ రెడ్డి అని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. మూసీ పేరుతో లూటీకి ప్లాన్‌ చేసి.. అడుగడుగునా జుగుప్సాకరమైన భాష వాడిన సీఎం రేవంత్‌ రెడ్డిపై ముందు కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను సీఎం ఇంటి మీదకు పంపించండి.. పేదల ఇళ్లకు కాదని తెలంగాణ పోలీసులకు సూచించారు. హైడ్రా వ్యవహారంతో నష్టపోయిన బాధితులు సీఎం రేవంత్‌ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియోలను షేర్‌ చేశారనే ఆరోపణలతో కల్వకుర్తి మండలం కడ్తాలలో బీఆర్‌ఎస్‌ కార్యకర్త నరేశ్‌ను అరెస్టు చేయడంపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రి పోలీసులను కడ్తాలకు పంపి నరేశ్‌ను అరెస్టు చేసి కంచన్‌బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారని ఆయన తెలిపారు. నరేశ్‌తో పాటు అతని మిత్రులకు చెందిన 4 ఫోన్లను అక్రమంగా గుంజుకున్నారని మండిపడ్డారు. బీఎన్‌ఎస్‌ఎస్‌ 35(3) యాక్ట్‌ ప్రకారం నరేశ్‌ను బెయిల్‌పై రిలీజ్‌ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఇంకా విడుదల చేయట్లేదని అన్నారు. అందుకే పోలీస్‌ స్టేషన్‌కు వచ్చామని వివరించారు. నరేశ్‌ ఒక్కడినే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఎంతోమంది పేద ప్రజలపై రాత్రికి రాత్రే కేసులు పెట్టారని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. ఇంకా ఎన్ని రోజులు, ఎంతమంది ప్రజలను ఇట్ల సతాయిస్తారని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించే 66 ఐటీ యాక్ట్‌ చెల్లదని ముంబై హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇంకా జ్ఞానోదయం కాలేదా అని మండిపడ్డారు.

Related posts