Praja Kshetram
తెలంగాణ

గ్రేటర్ కాంగ్రెస్ నేతల వినూత్న నిరసన..

గ్రేటర్ కాంగ్రెస్ నేతల వినూత్న నిరసన..

 

హైదరాబాద్ అక్టోబర్ 31 (ప్రజాక్షేత్రం): మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలతో కలిసి గ్రేటర్ కాంగ్రెస్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. మూసీ వెంట దుర్బర జీవితాలు గడుపుతున్న వారితో దీపావళి వేడుకలు చేసుకోవాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ కు గ్రేటర్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఒక్క రోజైనా తమ ప్రాంతంలో ఉండి సమస్యలు తెలుసుకోవాలంటూ మూసీ ప్రాంత ప్రజలు కూడా కేటీఆర్‌ను కోరుతున్నారు. ఈ సందర్బంగా కేటీఆర్, హరీష్ రావు ఫోటోలను ఏర్పాటు చేసి బొకేలతో వెల్కమ్ చెబుతూ నిరసన చేపట్టారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో కేటీఆర్ నిద్ర చేయాలంటూ మడత మంచాలను కూడా గ్రేటర్ కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేశారు. మూసీ ప్రక్షాళనను బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవద్దంటూ వారు ఆందోళన చేపట్టారు. కాగా మూసీ ప్రక్షాళన పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేసేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు.ఢిల్లీ పెద్దలకు మూటలు పంపేందుకే రూ.20 వేల కోట్లతో పూర్తయ్యే సుందరీకరణను కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.1.50 లక్షల కోట్లకు పెంచిందని ఆయన విమర్శించారు. 4 కోట్ల ప్రజల సంపదను దోచుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు రాబందుల్లా మారారని విమర్శించారు. మూసీలోకి కొండపోచమ్మ రిజర్వాయర్‌ ద్వారా గోదావరి జలాలను తీసుకువచ్చేందుకు గత ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో వివిధ పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగానే నాచారం పెద్దచెరువు వద్ద 17.5 ఎంఎల్‌డీ, ఉప్పల్‌ నల్లచెరువు వద్ద 86.5 ఎంఎల్‌డీల ఎస్టీపీలను నిర్మించామన్నారు. హైదరాబాద్‌ నగరంలో రోజు 2వేల మిలియన్‌ లీటర్ల మురుగు వస్తుందని, శుద్ధి చేసేందుకు రూ.3,866 కోట్లతో 1,250 ఎంఎల్‌డీల సామర్థ్యం కలిగిన ఎస్టీపీలు పూర్తి చేశామని చెప్పారు. 2014కు ముందు 700ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన ఎస్టీపీలు మాత్రమే ఉండేవని గుర్తుచేశారు. తమ హయాంలో రూ.545 కోట్లతో మూసీపై 14 కొత్త వంతెనలు నిర్మించ తలపెట్టినట్లు చెప్పారు. కొండపోచమ్మ సాగర్‌ నుంచి గోదావరి జలాలు తీసుకువచ్చే ప్రాజెక్టును పూర్తిచేస్తే మూసీ సుందరీకరణ పూర్తి అవుతుందన్నారు. అది చేయకుండా కాంగ్రెస్‌ సర్కారు పేదల ఇళ్లను కూలగొడుతూ భయాందోళనలకు గురిచేస్తోందని విమర్శించారు. మూసీ, చెరువుల పరీవాహక ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకున్న పేదలందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు మూసీ నదిని ప్రక్షాళన చేసి హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుందని, ఎన్ని శక్తులు అడ్డుపడినా ప్రక్రియ పూర్తి చేసే బాధ్యతను కాంగ్రెస్‌ పార్టీ తీసుకుంటుందని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ పరీవాహక ప్రాంతం మురికి కూపంగా మారి.. హైదరాబాదీలకు విష వాయువులు అందిస్తుందని, దుర్భరంగా మారిన వారి జీవన విధానం మార్చేందుకు మూసీని ప్రక్షాళన చేసి, పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మూసీ వెంట నరకం అనుభవిస్తోన్న పేదవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

Related posts