అమరావతికి మోదీ భారీ వరం..!!
అమరావతి నవంబర్ 14 (ప్రజాక్షేత్రం):ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం మరో వరం ప్రకటించింది. అమరావతి కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చేసిన పలు అభ్యర్ధనలను కేంద్రం ఆమోదించింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రూ 15 వేల కోట్ల రుణం పైన ఒప్పందాలు జరిగాయి. జనవరి నుంచి నిర్మాణాల దిశగా ప్రణాళిక లు సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్దికంగా భారం తగ్గించేలా కేంద్రం నుంచి మరో హామీ దక్కింది. దీంతో, ఏపీ ప్రభుత్వానికి భారీ రిలీఫ్ దక్కనుంది.
ఏపీ అభ్యర్ధనతో
అమరావతిలో కీలకమైన బైపాస్ ప్రాజెక్టుల భూ సేకరణ ఖర్చు భరించేందుకు కేంద్రం అంగీక రించింది. ఏపీ ప్రభుత్వం చేసిన అభ్యర్ధనకు సానుకూలత వ్యక్తం చేసింది. అమరావతిలో ఔటర్, తూర్పు బైపాస్ రోడ్ భూ సేకరణ ఖర్చు భరించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. 189 కిలో మీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు .. 59 కిలో మీటర్ల తూర్పు బైపాస్ రోడ్ల నిర్మాణం కోసం వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. దీని కోసం దాదాపుగా రూ 6 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసారు. ప్రస్తుతం ఏపీకి ఉన్న ఆర్దిక సమస్యలతో ఈ మొత్తం ఖర్చు చేయటం భారంగా మారుతోంది. దీంతో, ఈ ఖర్చును కేంద్రమే భరించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది.
అమరావతికి కీలకం
ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంద్రబాబు కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత ఏపీ – కేంద్ర అధికారుల మధ్య జరిగిన చర్చల తో బైపాస్ నిర్మాణం కోసం భూ సేకరణ ఖర్చు తామే భరిస్తామని ఎంవోఆర్టీహెచ్ వెల్లడంచింది. అయితే, ఈ ఒప్పందంలో భాగంగా తమకు స్టేట్ జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కోరింది. ఇందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. స్టేట్ జీఎస్టీని మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి ఔటర్ బై పాస్ భూ సేకరణ కోసం రూ 4 వేల కోట్లు.. తూర్పు బై పాస్ భూ సేకరణ కోసం రూ 2 వేల కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా. ఇప్పుడు కేంద్రం ఈ ఖర్చుకు అంగీకరించటంతో ఏపీ ప్రభుత్వానికి రూ6 వేల కోట్ల మేర రిలీఫ్ దక్కింది.
కేంద్రం అంగీకారంతో
ఏపీ ప్రభుత్వం గతంలోనే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం భారత్ మాల ఛాలెంజింగ్ ప్రోగ్రాం కింద చేర్చాలని కోరింది. అయితే, అప్పట్లోనే భూ సేకరణ ఖర్చు సగం భరించాలని కేంద్రం షరతు విధించింది. తాజాగా రాజధాని నిర్మాణం కోసం సిద్దం చేసిన అంచనాల్లో అమరావతి ఔటర్ కోసం రూ 26 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసారు. ఇప్పుడు రహదారి నిర్మాణంతో పాటుగా భూ సేకరణకు కేంద్రం ముందుకు రావటంతో ఇక ఈ నిర్మాణం వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం స్టేట్ జీఎస్టీ మినహాయింపుతో భూ సేకరణ పైన త్వరలోనే నోటిఫికేషన్ జారీ కానుందని అధికారులు వెల్లడించారు. రాజధాని నిర్మాణంలో ఇది కీలక ఘట్టంగా మారనుంది.