Praja Kshetram
తెలంగాణ

ఎస్సీ వర్గీకరణ కోసం గళం విప్పి గజ్జె కడుతాం

ఎస్సీ వర్గీకరణ కోసం గళం విప్పి గజ్జె కడుతాం

 

-వెయ్యి గొంతులు లక్ష డప్పుల ప్రదర్శనలో మద్దతుగా పాల్గొంటాం

హైదరాబాద్ డిసెంబర్ 27(ప్రజాక్షేత్రం):హైదరాబాద్ లో బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న అధ్యక్షతన కళానేతల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా గాయని విమలక్క, మధుప్రియ, నల్లగొండ గద్దర్, దరువు అంజన్న, వరంగల్ శ్రీనన్న, రేలారే గంగ, మిట్టపల్లి సురేందర్, క్రాంతి దళ్ పృథ్విరాజ్ యాదవ్, మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్, పాటమ్మ రాంబాబు, దరువు ఎల్లన్న, నలిగంటి శరత్, రేలారే ప్రసాద్, ఐలయ్య, యాకన్నలతో పాటు ప్రముఖ కళానేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ” అంబేద్కర్ ఆశయాల సాధనలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగితే ఏ కులానికి అన్యాయం జరగదు, జనాభా ప్రాతిపదికన ఎస్సీలలో ఉన్న అన్ని కులాలకు రిజర్వేషన్లు లభించి న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ పోరాటం న్యాయమైంది కనుకనే సమాజం మొత్తం మద్దతు ఇచ్చిందని అన్నారు. కానీ మాలలు తమకున్న రాజకీయ పలుకుబడితో ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడానికి నేడు బలంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆ అడ్డంకులను ఎదుర్కోవడానికి వెయ్యి గొంతులు – లక్ష డప్పులతో మండే మాదిగల గుండె చప్పుళ్ళును వినిపించడానికి శ్రీకారం చుట్టామని అన్నారు. మరొక్కసారి అన్ని సామాజిక వర్గాలలో ఉన్న కళా నేతలంతా ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మద్దతుగా నిలబడాలని అన్నారు. ఫిబ్రవరి 3 న జరుగు వెయ్యి గొంతులు లక్ష డప్పులు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంలో కళానేతలు మాట్లాడుతూ ” ఎస్సీ వర్గీకరణ న్యాయం కాబట్టే మొదటి నుండి ఎమ్మార్పీఎస్ కు మద్దతు తెలుపుతున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి ఎంతటి బలమైన పాత్రని కళానేతలు పోషించారో అదే విధంగా ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని విజయానికి చేర్చడానికి కూడా అదే పాత్రను పోషిస్తామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం మరొక్కసారి గజ్జె కట్టి గళం విప్పి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు.ఎస్సీ వర్గీకరణ కోసం నూతన పాటలను రూపొందించి ప్రజల్ని మరింత చైతన్యం చేస్తామని అన్నారు. అందులో భాగంగా వెయ్యి గొంతులు లక్ష డప్పులు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని కళాకారులంతా పాల్గొంటామని తెలిపారు.

Related posts