Praja Kshetram
తెలంగాణ

డ్యూటీలు ఎగ్గొట్టి బర్త్ డే పార్టీలు..ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకం…

డ్యూటీలు ఎగ్గొట్టి బర్త్ డే పార్టీలు..ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకం…

నిజామాబాద్ జనవరి 13(ప్రజాక్షేత్రం):విధులు మరచి వింధులు, వినోదాల్లో మునిగి తేలిన ఓ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది తీరుపై రోగులు, బంధువులు దుమ్మెత్తి పోస్తున్నారు. రోగులను గాలికొదిలేసి జన్మదిన వేడుకలు చేసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రినే ఏకంగా ఫంక్షన్ హాల్‌గా మార్చేసిన అధికారి తీరును నిరసిస్తూ ఆస్పత్రి ఎదుటే పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్‌పై రోగులు మండిపడుతున్నారు. ప్రతిమారాజ్ తన ఛాంబర్‌ను ప్రైవేట్ ఫంక్షన్ హాలుగా మార్చేసి బర్త్ డే వేడుకలు నిర్వహించారని రోగులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది మొత్తం ఒకే చోట చేరి వేడుకలు చేసుకుని సంబరాల్లో మునిగితేలారు. అయితే అదే సమయంలో ఆస్పత్రి సిబ్బంది తీరుతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లక్ష్మి అనే మహిళలకు ఫిట్స్ రావడంతో కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రి వర్గాలు జన్మదిన వేడుకలు చేసుకుంటూ బాధితురాలిని నిర్లక్ష్యంగా వదిలేశారు. అనారోగ్యానికి గురైన భార్యను ఓ భర్త ఏడో అంతస్తు వరకూ తన భుజాలపైనే మోసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు స్కానింగ్ సెంటర్లు సైతం సిబ్బంది తెరవలేదు. అలాగే ఆస్పత్రిలో బెడ్లపై ఉన్న రోగులను సైతం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారంటూ పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే తమను పట్టించుకోకుండా పార్టీలు చేసుకోవడం ఏంటని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, సిబ్బంది తీరును ఖండిస్తూ ఆస్పత్రి ఎదుటే ఆందోళనకు దిగారు. ప్రతిమారాజ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డ్యూటీలు ఎగ్గొట్టి బర్త్ డే పార్టీలు చేసుకోవడం ఏంటని, ప్రాణాలు పోయినా మీకు పర్వాలేదా? అంటూ పెద్దఎత్తున నిరసనకు దిగారు.

Related posts