Praja Kshetram
పాలిటిక్స్

గ్రామ గ్రామానికీ బీసీ వాదాన్ని తీసుకెళ్తాం..

గ్రామ గ్రామానికీ బీసీ వాదాన్ని తీసుకెళ్తాం..

 

– కులగణన పత్రాలు తగులబెడితే సస్పెండ్‌ చేస్తారా?

– ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న

హైదరాబాద్ మార్చి 06(ప్రజాక్షేత్రం):బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతుంటే బీసీ నేతలను అణగదొక్కుతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. బీసీలను కించపరిస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం నుంచి గ్రామ గ్రామానికి బీసీ వాదాన్ని తీసుకెళ్తామని, బీసీ మేధావులతో చర్చించి భవిషత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. బీసీ జేఏసీతో కలిసి ముందుకెళ్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పు అని పత్రాలు తగులబెడితే తనను కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తారా అని ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడిపై ఒత్తిడి చేసి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నానంటూ తనను సస్పెండ్‌ చేయించారని ఆరోపించారు. తనను సస్పెండ్‌ చేస్తే బీసీ ఉద్యమం ఆగిపోదన్నారు. ఈ సందర్భంగా ఫ్రేమ్‌లో పెట్టి ఇచ్చిన సస్పెన్షన్‌ కాపీని ప్రదర్శించారు. బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల రక్షణ కోసమే బీసీ జనాభా తగ్గించారన్నారు. 2028లో బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ బతకాలని కోరుకుంటున్నానని అన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచన లేదని ఈ సందర్భంగా చెప్పారు. సమావేశంలో బీసీ జేఏసీ నాయకులు వట్టే జానయ్య యాదవ్‌, సంగెం సూర్యారావు, పి.సత్యం వంశరాజ్‌, గటిక విజయ్‌కుమార్‌, ఓదేలు యాదవ్‌, రజని తదితరులుపాల్గొన్నారు.

Related posts