రైతుల ప్రాణాలకు ముప్పుగా వేలాడుతున్న విద్యుత్ తీగలు!
– రైతుల జీవితాలతో ఆటలాడకండి చర్యలు తీసుకోండి.
– రైతుల ఆవేదన – ఎవరూ పట్టించుకోరా?
– తమ ఆక్రోషం వెళ్లగకుతున్న పొద్దుటూరు గ్రామ రైతులు.
శంకర్ పల్లి మార్చి 15(ప్రజాక్షేత్రం): శంకర్ పల్లి మండల పరిధిలోని పొద్దుటూరు గ్రామంలో 651 సర్వే నెంబర్, పంట పొలాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీగలు నేలపై పడిపోతుండటంతో రైతులు, కూలీలు తమ పొలాల్లో పనిచేయడానికే భయపడుతున్నారని రైతులు తమ బాధను వెళ్ళగకుతున్నారు. ఈరోజు తీగలు ఒకదానిపై ఒకటి పడటంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని వెంటనే స్పందించి మంటలు ఆర్పి వేశామని తెలియజేశారు. పాత విద్యుత్ స్తంభాలు శిథిలావస్థలో ఉన్నాయి. తుపానులు, గాలుల వల్ల తీగలు ఊగిపోతున్నాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే రైతుల ప్రాణాలకు భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందిని సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రాధేయ పడుతున్నారు.
– రైతుల విజ్ఞప్తి
వేలాడుతున్న తీగలను వెంటనే మరమ్మతులు చేయించి పాత స్తంభాలను కొత్త వాటితో మార్చి ఈ ప్రమాదకర పరిస్థితిని నియంత్రించాలని అంటున్నారు. విద్యుత్ శాఖ అధికారులు, సంబంధిత ఇంజినీరింగ్ విభాగం, గ్రామ పంచాయతీ, జిల్లా కలెక్టర్ గారు దయచేసి ఈ సమస్యను పట్టించుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు రాములు, మల్లారెడ్డి, ముకుంద్ రెడ్డి తదితరులు సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు.