వామ్మో.. కూల్ డ్రింక్లో బల్లి అవశేషాలు.. సంగారెడ్డి జిల్లా హైవే హోటల్లో ఘటన వైరల్
సంగారెడ్డి ఏప్రిల్ 18(ప్రజాక్షేత్రం): భారత్లో ఫుడ్ సేఫ్టీ అనేది పెద్ద జోక్ అయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడో చోట ఏదో రెస్టారెంట్లో తినే ఫుడ్లో బొద్దింకలు, ఎలుకలు, బల్లులు, జర్రులు పడ్డ ఘటనలు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు జాబితాలోకి కూల్ డ్రింక్స్ వంతు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా సమాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పరిధిలోని పెద్దపూర్ వద్ద ఎన్హెచ్ 65 పక్కన ఉన్న హోటల్లో ఇద్దరు యువకులు తాగిన కూల్ డ్రింక్లో చనిపోయిన బల్లి అవశేషాలు కనిపించాయి. సగం కూల్ డ్రింక్ తాగిన తర్వాత కస్టమర్ బల్లి అవశేషాలను గమనించాడు. ఇదేమిటని హోటల్ యజమానిని ప్రశ్నించడంతో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సగం కూల్ డ్రింక్ తాగడంతో యువకుడు స్వల్ప అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. ఈ క్రమంలోనే యువకుడిని ఆసుపత్రికి స్నేహితులు తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో ఆహార భద్రత అధికారులు చర్యలు తీసుకోవాలని కస్టమర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పలు రెస్టారెంట్లలో ఇలాంటి నిర్లక్ష్యం కనుబడుతోందని నెటిజన్లు వెల్లడించారు. వామ్మో.. బయట ఫుడ్ ఏదైనా తినాలన్నా.. తాగాలన్నా.. భయం అవుతోందని నెటిజన్లు ఆందోళనకు గురవుతున్నారు.