Praja Kshetram
తెలంగాణ

హైదరాబాద్‌ విడిచి వెళ్లాల్సిందే.. పాకిస్థానీలకు నోటీసులు

హైదరాబాద్‌ విడిచి వెళ్లాల్సిందే.. పాకిస్థానీలకు నోటీసులు

 

 

హైదరాబాద్, ఏప్రిల్ 26(ప్రజాక్షేత్రం):నగరంలో ఉన్న నలుగురు పాకిస్థానీలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆదివారం లోగా హైదరాబాద్‌ను విడిచి వెళ్లాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ నలుగురు షార్ట్ టర్మీ వీసా (ఎస్‌టీవీ) హోల్డర్స్‌గా ఉన్నట్లు గుర్తించారు. అలాగే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్‌లో కలిపి మొత్తం 213 మంది పాకిస్థానీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో నలుగురు షార్ట్ టర్మ్ వీసా మినహాయిస్తే మిగతా అందరికీ లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నట్టు తెలుస్తోంది. లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన పాకిస్తానీలకు కేంద్రం మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో షార్ట్ టర్మ్ వీసా కలిగిన నలుగురు పాకిస్థానీలకు హైదరాబాద్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తాము ఇచ్చిన గడువులోపు దేశం విడిచి వెళ్లకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో తెలంగాణ పోలీసు శాఖ స్పష్టంగా పేరింది. ఈ నలుగురులో ఇద్దరు పాతబస్తీలో ఉంటుండగా, మరో ఇద్దరు మరో ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఎస్‌బీ ఇచ్చిన సమాచారంతో నలుగురికి దేశం విడిచి వెళ్లాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

కాగా.. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాహ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇందులో భాగంగా భారత్‌లో ఉన్న పాకిస్థానీల వీసాలు రద్దు చేస్తూ కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 26 తర్వాత పాకిస్థానీయలు దేశం విడిచి వెళ్లాల్సిందే అని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 27 తరువాత పాకిస్థానీయుల వీసాలు పనిచేయవు. అలాగే మెడికల్‌పై వచ్చిన పాకిస్థానీయులు వీసాలకు ఏప్రిల్ 29 వరకు గడువు విధించింది కేంద్రం. పాక్ ప్రజల వీసాలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. రాష్ట్రాల్లో ఎంత మంది పాకిస్థానీయులు ఉన్నారో గుర్తించి వారిని వెంటనే దేశం విడిచి వెళ్లాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. అలాగే తెలంగాణలో ఉన్న పాకిస్థానీయులు కూడా వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని పోలీసులు నోటీసలు జారీ చేస్తున్నారు. రేపటిలోగా రాష్ట్రాన్ని విడిచి స్వదేశానికి వెళ్లిపోవాలని.. ఒకవేళ గడువులోపు దేశం విడిచి వెళ్లని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని తెలంగాణ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

Related posts