ఏసీబీ వలకు చిక్కిన గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ
అమరావతి ఆగస్టు 08(ప్రజాక్షేత్రం):ఏసీబీ వలకు చిక్కిన గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ ఆంధ్రప్రదేశ్లో భారీ అవినీతికి పాల్పడ్డ ఓ అధికారిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బలంగా పట్టుకుంది. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ చీఫ్ (ఈ ఎన్ సి) సబ్బవరపు శ్రీనివాస్, భారీగా లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై ఏసీబీ అధికారులకు చిక్కారు.
– పదవీ విరమణకు ముందు పతనం.
మరికొన్ని వారాల్లో పదవీ విరమణ చేయాల్సి ఉన్న శ్రీనివాస్, చివరి రోజుల్లోనే రూ. 5 కోట్లు లంచం డిమాండ్ చేసి తన సేవా గమనాన్ని మసకబార్చుకున్నాడు. విజ్ఞత వహించిన ఎసిబి అధికారులు అతడిని రూ. 25 లక్షల టోకెన్ నగదు స్వీకరిస్తుండగా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఇది ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద ట్రాప్గా చెబుతున్నారు.
– ఏకలవ్య పాఠశాలల కాంట్రాక్ట్కు లంచం డిమాండ్.
గిరిజన ప్రాంతాల్లో నిర్మించబోయే ఏకలవ్య మోడల్ పాఠశాలల కాంట్రాక్ట్ని సాధించుకున్న సత్యసాయి కన్స్ట్రక్షన్ అధినేత కృష్ణంరాజు, పనులకు సంబంధించిన రూ. 35.5 కోట్ల బిల్లు విడుదల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న సమయంలో, శ్రీనివాస్ అతడి నుంచి రూ. 5 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.
– కలసికట్టుగా వేసిన ఏసీబీ వల.
ఈ అవినీతి వ్యవహారాన్ని ఛేదించేందుకు విశాఖపట్నం మరియు విజయవాడ ఏసీబీ అధికారులు కలిసి కార్యాచరణ రూపొందించారు. చివరికి ప్లాన్ ప్రకారం శ్రీనివాస్ను పట్టుకుని, లంచం తీసుకుంటున్న సమయంలో నిర్బంధించారు. ప్రస్తుతం ఆయన జైల్లో రిమాండ్లో ఉన్నారు.
