ఇకపై ఆధార్ సెంటర్లకు వెళ్లక్కర్లేదు!
– మొబైల్లోనే పేరు, అడ్రస్, నంబర్ మార్పులు చేర్పులు!!
– ఏఐ, ఫేస్ ఐడీ ఫీచర్లతో కొత్త ఈ-ఆధార్ యాప్
- ఇకపై ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పనే లేదు!
బయోమెట్రిక్ డేటా మార్చుకోవచ్చా?
కొత్త యాప్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ లాంటి బయోమెట్రిక్ డేటాలో మార్పులు చేయాలంటే, కచ్చితంగా వ్యక్తిగతంగా ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం యూఐడీఏఐ ‘బయోమెట్రిక్ అప్డేట్’ గడువును 2025 నవంబర్ వరకు పొడిగించింది.
ఇంతకీ ఇది సురక్షితమేనా?
ఏఐ, ఫేస్ ఐడీ ఫీచర్లతో కొత్త ‘ఈ-ఆధార్ యాప్’ను తీసుకువస్తున్నారు. కనుక ఆధార్ వివరాల అప్డేట్ ప్రక్రియ చాలా వేగవంతం అవుతుంది. పైగా ఇది సురక్షితంగా ఉంటుంది. ప్రస్తుతం ఆధార్ వివరాలు అప్డేట్ చేయాలంటే పాస్వర్డులు, ఓటీపీలు ఎంటర్ చేయాల్సి వస్తోంది. కానీ కొత్త యాప్ అందుబాటులోకి వస్తే ఫేస్ ఐడీతో నేరుగా లాగిన్ అవ్వవచ్చు. వివరాలు అప్డేట్ చేయవచ్చు. కనుక యూజర్ల వ్యక్తిగత వివరాల చోరీకి, మోసాలకు అవకాశం తగ్గుతుంది.
ఆటోమేటిక్ వెరిఫికేషన్
కొత్త యాప్ వచ్చిన తరువాత ఆటోమేటిక్గా వెరిఫికేషన్ పూర్తి అయిపోతుంది. ఎలా అంటే? యూజర్ తన ఆధార్ చిరునామా వివరాలు సమర్పిస్తే, ఆ వివరాలు సరైనవో, కావో క్రాస్-వెరిఫికేషన్ చేస్తుంది. ఇందుకోసం ప్రభుత్వ డేటా బేస్ను ఉపయోగిస్తుంది. అంటే మీ పాన్ డేటాబేస్, పాస్పోర్ట్ ఆఫీస్, డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రీ సహా ఇతర వివరాలను ఆటోమేటిక్గా వెరిఫై చేస్తుంది. దీనితో పాటు మీ చిరునామా నిర్ధరణ చేయడానికి, మీ విద్యుత్ బిల్లులు వంటి వాటిని కూడా తనిఖీ చేస్తుంది.
ఈ కొత్త యాప్ అవసరమా?
భారతదేశంలో 130 కోట్లకు పైగా ఆధార్ కార్డు హోల్డర్లు ఉన్నారు. వీరిలో చాలా మంది మారుమూల ప్రాంతాల్లో, ఇంటర్నెట్ అందుబాటులో లేని స్థితిలో ఉన్నారు. చాలా మందికి డిజిటల్ అక్షరాస్యత, ప్రయాణ సౌకర్యాల లేమి లాంటి సమస్యలు ఉన్నాయి. ఉద్యోగులకు సరైన సమయానికి సెలవులు దొరకని పరిస్థితి- ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. అందువల్ల కొత్త ఈ-ఆధార్ యాప్ తీసుకువస్తే, వీళ్లతోపాటు అందరికీ కచ్చితంగా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఆధార్ను చాలా సులువుగా అప్డేట్ చేసుకోవడానికి వీలవుతుంది. అందుకే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, యూఐడీఏఐ కొత్త ఈ-ఆధార్ మొబైల్ యాప్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాయి.
