ఏసీబీ వలలో వనపర్తి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
– యూరియా సరఫరా కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ అధికారి.
– రూ.10 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.
– వనపర్తి జిల్లా ఏఓ పుప్పాల ఆంజనేయులు గౌడ్ అరెస్ట్
– లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ప్రజలకు ఏసీబీ విజ్ఞప్తి
వనపర్తి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 20(ప్రజాక్షేత్రం):జిల్లాలో ఓ అవినీతి అధికారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. వనపర్తి జిల్లా వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న పుప్పాల ఆంజనేయులు గౌడ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే, ఒక రైతుకు యూరియా బస్తాలు సరఫరా చేసేందుకు గాను ఆంజనేయులు గౌడ్ రూ.20,000 లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే బాధితుడి నుంచి రూ.3,000 అడ్వాన్స్గా తీసుకున్నారు. మిగిలిన మొత్తంలో నుంచి రూ.10,000 నగదును తీసుకుంటున్న సమయంలో, ముందుగా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచన చేశారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ 1064కు డయల్ చేయాలని తెలిపారు. వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) వంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. ఫిర్యాదుదారుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని అధికారులు భరోసా ఇచ్చారు.
