Praja Kshetram
తెలంగాణ

కాంగ్రెస్‌, బీజేపీ దొందుదొందే..

కాంగ్రెస్‌, బీజేపీ దొందుదొందే..

అన్ని వర్గాలకు సమన్యాయం చేసింది కేసీఆర్‌

నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

ఆమనగల్లు, ఏప్రిల్‌ 25 (ప్రజాక్షేత్రం) : సమాజంలో ఎంతో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని కాదని ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్‌, మాడ్గుల మండలాల్లో కార్నర్‌ మీటింగ్‌లు ఏర్పాటు చేశారు.

ఆమనగల్లు మండలంలోని చింతలపల్లి., తలకొండపల్లి మండలంలోని చుక్కాపూర్‌, ఖానాపూర్‌, వెంకట్రావ్‌పేట్‌, గట్టుప్పలపల్లి, మెదక్‌పల్లి, రాంపూర్‌, చంద్రాధాన, తలకొండపల్లి, పడకల్‌, రావిచేడ్‌, మక్తమాదారం., కడ్తాల్‌ మండలంలోని మైసిగండి, కర్కల్‌పహాడ్‌, ఎక్వాయిపల్లి గ్రామాల్లో రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లు ఏర్పాటు చేశారు. మొదటగా ఆమనగల్లులోని సంత్‌ సేవాలాల్‌ గుట్ట వద్ద సంత్‌ సేవాలాల్‌ విగ్రహనికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

ప్రశ్నించే గొంతుక పార్లమెంటులో ఉండాలి
రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఆగమాగం చేసిన తెలంగాణ రాష్ట్రం పూర్వవైభవం, పునర్నిర్మాణం జరగాలంటే, కేసీఆర్‌ నాయకత్వం మళ్లీ రావాలంటే ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ లాంటి ప్రశ్నించే గొంతుక పార్లమెంట్‌లో ఉండాలన్నారు.

ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలం
మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అప్రజాస్వామిక పాలన సాగిస్తున్నదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తి వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌ దీవించి పంపిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ లాంటి ఉన్నత విద్యావంతుడికి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇవ్వాలని ఆయన కోరారు.

సమాజం అభివృద్ధి చెందాలంటే ఉచిత విద్య, వైద్యం అవసరం

బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. 26 సంవత్సరాల ఉన్నతస్థాయి పోలీస్‌ ఉద్యోగాన్ని వదిలి ప్రజా సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ ప్రజల గొంతుకగా సమస్యలను పార్లమెంట్‌లో వినిపించడానికే ఎన్నికల్లో నిల్చున్నానని స్పష్టం చేశారు. ఆమనగల్లులోని కొంత మంది నాయకులు ఇక్కడి బిడ్డలను మతం అనే మత్తు మందులో ఉంచి చాలా ఘోరంగా తయరు చేస్తూ దేశానికి భారంగా మారుస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ హయాంలో గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా పని చేసి వేలమంది విద్యార్థుల ఉన్నత చదువులకు శ్రీకారం చుట్టి ఎంతో మంది పేద, బడుగు బలహీన వర్గాల పిల్లలను ఉన్నతస్థాయి ఉద్యోగులుగా తీర్చిదిద్దానని తెలిపారు.

 

సమాజం అభివృద్ధి చెందాలంటే ఉచిత విద్య, వైద్యం ఎంతో అవసరమని.. దాని కోసం సీఎం కేసీఆర్‌ ఎంతో పరితపించారని, సాధ్యమైనంత వరకు అమలు చేశారన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని ప్రపంచ పటంలో నిలిపేందుకు కేసీఆర్‌ ఎంతో కృషి చేశారన్నారు. తనపై నమ్మకముంచి పార్లమెంట్‌లో మీ తరఫున ప్రశ్నించే అవకాశం ఇవ్వాలని కోరారు. మీ అందరి గొంతుకగా పార్లమెంట్‌లో కొట్లాడి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకువస్తానని ఆయన హామీ ఇచ్చారు. బీజేపీకి 400 పార్లమెంట్‌ సీట్లు వస్తే నరేంద్రమోదీ, అమిత్‌ లాంటి అగ్రనాయకులు భారత రాజ్యాంగం తీసివేస్తామని బహిరంగంగానే చెబుతున్నారని.. దీంతో రిజర్వేషన్లు, ఉద్యోగాలు మన పిల్లలకు రావని.. అలాంటి పరిస్థితి వస్తే రోడ్లపై బిచ్చమెత్తుకోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా ఆనాటి మూతికి ముంత, నడుముకు తాటాకు కట్టుకొని బతకాల్సిన రోజులు వస్తాయన్నారు. అలాంటి బీజేపీ నాయకులు మీ గ్రామాల్లోకి వస్తే నిలదీయాలన్నారు. కాంగ్రెస్‌ , బీజేపీలు ఒకేటేనని.. బడేబాయ్‌-చోటేబాయ్‌ అనుకుంటున్నారని., ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఓటు వేయవద్దని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే కరువు అని మరోమారు నిరూపితమైందని దుయ్యబట్టారు. రైతు రుణమాఫీపై పూటకో మాట మారుస్తూ సీఎం రేవంత్‌రెడ్డి పబ్బం గడుపుతున్నారన్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకు పోయిన దొంగ మన రాష్ట్ర సీఎం కావడం మన దురదృష్టమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హామీలపై నిలదీయాలని కోరారు. ఎన్నో మెడికల్‌ కళాశాలు, గురుకులాలు, ప్రాజెక్టులు కట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

కార్యక్రమంలో పార్లమెంట్‌ ఎన్నికల ఇన్‌చార్జి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మిషన్‌ భగీరథ మాజీ వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌, జడ్పీటీసీలు అనురాధ, దశరథ్‌నాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ వెంకటేశ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ సత్యం, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌ యాదవ్‌, వైస్‌ ఎంపీపీలు ఆనంద్‌, శంకర్‌, రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు ఎల్‌ఎన్‌ రెడ్డి, ఎంపీటీసీలు కుమార్‌, వెంకటయ్య, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు అర్జున్‌రావు, జైపాల్‌రెడ్డి, శంకర్‌, విజయ్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ అధ్యక్షుడు పత్యానాయక్‌, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు వీరయ్య, శ్రీనివాస్‌యాదవ్‌, చందు, నాయకులు సుభాష్‌, అల్లాజీ, ప్రసాద్‌, వెంకటేశ్‌, సతీష్‌, రమేశ్‌నాయక్‌, భాస్కర్‌, మహేశ్‌, మహేందర్‌, రాజు ఉన్నారు.

Related posts