Praja Kshetram
తెలంగాణ

మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్.

మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్.

మేడ్చల్ మే 24 (ప్రజాక్షేత్రం): బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డి కి మరో షాక్ తగిలింది. షామీర్ పేట్ మండలంలోని బొమ్రాసిపేట్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్‌ లో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్‌లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో జేసీబీల సాయంతో చెరువులో నిర్మించిన ప్రహరీ గోడలను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అలాగే పెద్ద చెరువును ఆక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను కూల్చివేశారు.

కాగా నగర శివార్లలోని కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధిలో సర్వేనంబరు 82, 83లలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరుల మధ్య నెలకొన్న భూ వివాదం తెలిసిందే. అయితే రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి వాదిస్తున్నారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదని మరో 15 మంది చెబుతున్నారు. కాగా నాలుగు రోజుల క్రితం సర్వే నెం.82లోని స్థలంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడుకు.. మరో 15మంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

*కోర్టు ఆర్డర్ ఉండటంతో…*

ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమిని కొనుగోలు చేశామని, కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని 15మంది పేర్కొంటున్నారు. అయితే ఆ స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పారు. అయితే మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని పోలీసులకు 15మంది సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ భూముల వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ విషయంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బుధవారం మల్లారెడ్డి బాధితులు సమావేశం నిర్వహించారు. మరోసారి మల్లారెడ్డిపై బాధితులు సంచలన ఆరోపణలు చేశారు.

 

*మా 33 గుంటలు.. మల్లారెడ్డి భూమిలో ..*

‘‘పూలు, పాలు అమ్ముడే కాదు… మల్లారెడ్డి భూ కబ్జాలు కూడా చేస్తున్నాడు. పేట్ బషీరాబాద్‌లోని 82 సర్వే నంబర్‌లో ఎకరం 29 గుంటల కన్నా.. ఎక్కువ ఉంటే మీకు సారీ చెప్పి రాజకీయాల నుంచి వెళ్లిపోతానని మల్లారెడ్డి చెప్పాడని… కానీ మమ్ముల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. రెవెన్యూశాఖ అధికారులు ఆదివారం చేసిన సర్వేలో 82 సర్వే నంబర్‌లో మల్లారెడ్డికి చెందిన ఎకరం 29 గుంటలతో పాటు.. మాకు చెందిన 33 గుంటలు అందులో కలిసిపోయింది. మల్లారెడ్డికి చెందిన ఎకరం 29 గుంటలు వదిలేసి.. మా 33 గుంటలను మాకు పొజిషన్ ఇప్పించాలి. మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ముందే ఈ సర్వే జరిగింది. మల్లారెడ్డి మాట మీద నిలబడాలి’’ అని బాధితులు పేర్కొన్నారు.

*చంపేస్తామని బెదిరిస్తున్నారు..*

‘‘2016లో మల్లారెడ్డి బీఆర్ఎస్‌ పార్టీలో చేరిన తర్వాత మా పార్టీషన్ తీసేసి మాపైన కేసు పెట్టించాడు. అప్పుడు పోలీసులను ఆశ్రయిస్తే కోర్టుకు వెళ్లమ్మన్నారు. కోర్టు నుంచి ‘‘నాట్ టు ఇంటర్ ఫియర్’’ అనే ఆర్డర్ తీసుకొచ్చాం. కోర్ట్ ఆర్డర్ ఉన్నా… అప్పట్లో మాకు న్యాయం జరగలేదు.రీసెంట్‌గా మా డాక్యుమెంట్లు, కోర్టు ఆర్డర్ తీసుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్లాం. మాకు సరైన డాక్యుమెంట్లు ఉన్నాయి కాబట్టి మా ల్యాండ్‌లోకి మమ్మల్ని వెళ్లమని పోలీసులు చెప్పారు. దీంతో మా భూమిలోకి వెళ్లి మేము బ్లూ షీట్స్ వేసుకున్నాం. దీంతో మల్లారెడ్డి వచ్చి మాపై దాడులు చేసి పోలీసుల ముందే మేము వేసిన బ్లూ షీట్స్ తొలగించారు. పోలీసుల ముందే మమ్ముల్ని చంపేస్తామని మల్లారెడ్డి బెదిరించారు’’ అని ఆయన బాధితులు సంచలన ఆరోపణలు చేశారు.

Related posts