యూనిఫామ్ కొలతల్లో తేడా రానివ్వొద్దు
కుట్టు సెంటర్ను పరిశీలిస్తున్న కలెక్టర్ శశాంక
మొయునాబాద్ మే 31 (ప్రజాక్షేత్రం) : విద్యార్థులతో తీసుకున్న కొలతల ప్రకారమే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్లు కుట్టాలని, విద్యార్థులకు నప్పేలా కుట్టి సకాలంలో అందించాలని జిల్లా కలెక్టర్ శశాంక సూచించారు. శుక్రవారం చిలుకూరులోని మహిళా శక్తి స్టిచ్చింగ్ సెంటర్ను పరిశీలించారు. రోజుకు ఎన్ని జతల స్కూల్ డ్రెస్సులు కుడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. డ్రెస్సుల స్టిచింగ్లో నాణ్యత పాటించాలన్నారు. మన్నికగల మెటీరియల్నే వాడాలన్నారు. ఆర్థికంగా వృద్ధి చెందేందుకే మహిళా సంఘాలకు డ్రెస్ల స్టిచింగ్ అప్పగించాలమని తెలిపారు. కుట్టు అనంతరం ఈ నెల 10వ తేదీ లోపు స్కూళ్లకు అప్పగించాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ గౌతమ్కుమార్, ఆర్ఐ చారి, ఏపీఏం రవీందర్, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, మహిళా సమాఖ్య సంఘం సభ్యులు అశ్విని, మంజుల, జియా, అనిత, స్వప్న సభ్యులు తదితరులు ఉన్నారు.
*జిల్లాలో విత్తనాల కొరత లేదు*
జిల్లాలో అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, విత్తనాల కొరత లేదని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. శుక్రవారం ఆయన మొయినాబాద్లోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేశారు. పత్తి, ఇతర విత్తనాల లభ్యత, స్టాక్ రిజిష్టర్, బిల్లు బుక్కులను పరిశీలించారు. బూజు పట్టిన పత్తి విత్తనాలను ఎట్టిపరిస్థితుల్లో విక్రయించేది లేదని హెచ్చరించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీలర్లు అన్ని రకాల విత్తనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. డీలర్లు ఎమ్మార్పీకే విత్తనాలు, ఎరువులను అమ్మాలని, ఎక్కువ ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి, ఏవో రాఘమ్మ, తహసీల్దార్ గౌతమ్ కుమార్, సిబ్బంది తదితరులు ఉన్నారు.