Praja Kshetram
జాతీయం

కేంద్ర కేబినెట్‌ కూర్పుపై ఉత్కంఠ.. బీజేపీ వద్దే కీలక శాఖలు..!

కేంద్ర కేబినెట్‌ కూర్పుపై ఉత్కంఠ.. బీజేపీ వద్దే కీలక శాఖలు..!

 

 

ఢిల్లీ జూన్ 06 (ప్రజాక్షేత్రం) మరో రెండు రోజుల్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఈ నెల 8 లేదా 9వ తేదీన మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే తమ కూటమికి నాయకుడిగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మోదీ 3.0లోని మంత్రివర్గం కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. కీలక శాఖలను మోదీ తన వద్దే ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది. హోం శాఖ, రక్షణ, విదేశాంగ, ఆర్థిక, రోడ్లు, రైల్వే, మౌలిక వసతులు, సంక్షేమంతోపాటు లోక్‌సభ స్పీకర్‌ పదవిని కూడా బీజేపీ తన వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. స్పీకర్‌ పదవిని తెలుగుదేశం పార్టీ ఆశించినట్లు తెలిసింది. అయితే, స్పీకర్‌ పదవికి బదులు డిప్యూటీ స్పీకర్‌ పదవిని టీడీపీకి కేటాయించేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దాంతోపాటు పౌర విమానయాన, ఉక్కు శాఖ సైతం టీడీపీకే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇక జేడీయూకి గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌, జేడీఎస్‌కు వ్యవసాయ శాఖ, శివసేనకు భారీ పరిశ్రమల శాఖను కేటాయించనున్నట్లు సమాచారం. వీటితోపాటు టూరిజం, స్కిల్ డెవలప్‌మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి ఇతర పోర్ట్‌ఫోలియోలను కూడా మిత్రపక్షాలకు పంచేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేబినెట్‌లోని కీలక పోర్ట్‌పోలియోలను మాత్రం బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకునేందుకు సిద్ధంగా లేదని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

Related posts