వికారాబాద్లో టూరిస్టులకు వింత కష్టాలు!
వికారాబాద్, జూలై 15(ప్రజాక్షేత్రం): జిల్లాలో పర్యాటకుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వీకెండ్ కావడంతో ఎంజాయ్ చేద్దామని వెళ్లిన వారు… అక్కడ మట్టిలో ఇరుక్కుపోయి నానా ఇబ్బందులు పడ్డారు. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కోట్పల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కాలువలో అనేక వాహనాలు ఇరుక్కుపోయాయి. రాత్రంతా బురదలో నుంచి తీయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వాహనాలను వాహనదారులు అక్కడే వదిలేయక తప్పలేదు. హైదరాబాద్ నుంచి వికారాబాద్ ప్రాంతంలో కోట్పల్లి ప్రాజెక్టు ప్రాంతంలోకి యువత ఎంజాయ్ చేయడానికి వచ్చారు. నిన్న సాయంత్రం వాహనదారులు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కాలువ దాటి వెళ్లారు. అయితే రాత్రి భారీ వర్షం పడడంతో తిరుగు ప్రయాణంలో అక్కడి నల్ల మట్టిలో ఇరుక్కుపోయారు. వాహనాలను తీయడానికి శతవిధాలుగా ప్రయత్నించినా నిరాశే ఎదురైంది. దీంతో చేసేదేం లేక వాహనాలను అక్కడే వదిలేశారు. దీంతో తెల్లారేసరికి వాహనాలు నీట మునిగాయి. ఎంజాయ్ చేద్దాం అని వస్తే వాహనాలు నీటిలో మునడంతో కంగుతినడం యువత వంతైంది. మూడు మహేంద్ర తార్తో పాటు ఓ ట్రాక్టర్ నీటిలో మునిగింది. ట్రాక్టర్ను గ్రామస్తులు తాడుతో ఒడ్డుకు తీయగా… తార్ వాహనాలు బురదలోనే ఉండిపోయాయి.